గోమహాత్యము - గోవుల సంరక్షణ విశేషాలు
భారతీయ ప్రాచీన గ్రంథాలలో వివరించిన గోమహాత్యము - గోవుల సంరక్షణ విశేషాలు -
భారతీయ ప్రాచీన గ్రంథాలలో గోవు యొక్క గొప్పతనం గురించి చాలా గొప్పగా వివరించబడినది. ఇలాంటి గొప్ప సమాచారం ఉన్న చాలా గ్రంథాలు మరుగునపడి అంతరించిపోయాయి. అటువంటి కొన్ని పురాతన గ్రంథాలు అవసాన దశలో నేను సేకరించడం జరిగింది. అవి ఎక్కువుగా గ్రాంధిక భాషయందు ఉన్నవి. అటువంటి భాషలో ఉన్న గ్రంథాలను సంపూర్ణంగా చదివి అత్యంత ముఖ్యమైన విషయాలను నేను రాసిన ఆయుర్వేద గ్రంథాలలో ప్రచురించడం జరిగినది. ఇప్పుడు మరికొన్ని గొప్ప విషయాలను మీకు తెలియచేస్తాను.
* గోవుల కొమ్ముల మొదట బ్రహ్మ, విష్ణువు ఎల్లపుడూ నివసించును. కొమ్ముల తుదిభాగము నందు స్థావరములు , జంగములగు సర్వతీర్ధములు ఉండును.
* గోవు శిరస్సు మధ్యభాగమున సర్వభూతమయుడగు మహాదేవుడు ఉండును. లలాటాగ్రభాగమున పార్వతి ఉండును. నొసటి భాగమున కుమారస్వామి ఉండును.
* గోవు నాసారంధ్రముల యందు కంబళుడు , అశ్వతరుడు అను సర్పములు ఉండును. చెవులలో అశ్వనీ దేవతలు ఉండును. కన్నుల యందు సూర్యచంద్రులు ఉండును.
* గోవు దంతముల యందు వాయువులన్నియు ఉండును. నాలుక యందు వరుణదేవుడు , హుంకారము యందు సరస్వతీదేవి , గండముల యందు యముడు , కుబేరులు ఉండును.
* గోవు పెదవుల యందు రెండు సంధ్యలు , మెడభాగంలో దేవేంద్రుడు , కక్షప్రదేశములో రాక్షసులు ఉండును. వక్షస్థలములో సాధ్యులు ఉండును.
* గోవు పిక్కల యందు నాలుగు పాదములు గల ధర్మదేవతయు , డెక్కలు మధ్యభాగమున గంధర్వులు , డెక్కల చివర భాగమున పన్నగులు ఉందురు .
* గోవు డెక్కలు వెనక భాగమున అప్యరః స్త్రీలు ఉండును. పృష్ఠభాగమున ఏకాదశ రుద్రులు ఉండును. సంధుల యందు వసువులు ఉందురు .
* గోవు పిరుదుల భాగము నందు పితృదేవతలు , తోక భాగము నందు చంద్రుడు , తొక చివరి భాగము నందు పిండిభూతములైన సూర్యచంద్రులు ఉండును.
* గోవు మూత్రమున గంగ , గోమయమున యమున , గోక్షీరము నందు సరస్వతియు , గోధధిలో నర్మద నదులు ఉండును.
* గోవు నెయ్యి యందు అగ్ని ఉండును. రోమములు యందు ఎనుబది కోట్ల దేవతలు ఉండును.
* గోవు ఉదరము నందు కొండలు , అరణ్యములు మున్నగు వానితో కూడి ఉండిన భూమి ఉండును. అవయవములు యందు సంపూర్ణములు అగు నాలుగు సముద్రములు , మేఘములు ఉండును.
బ్రమ్మాపురాణంలో విష్ణుమూర్తి గోసంరక్షణ గురించి బోధించిన విషయాలు -
* గోవులకు తగినంత ఆహారం ఇవ్వవలెను. బాగుగా కాంతిని ఇచ్చు దీపములను రాత్రుల యందు ఉంచవలెను. గోసన్నిధి యందు ఇతిహాస పురాణాలను చదవవలెను. వీణాదులను గానం చేయవలెను .
* లొపల సంతోషించుతూ యధాశక్తితో గోవులకు సేవచేయవలెను . కలలోనైనా గోవులను కొట్టరాదు. తిట్టరాదు. ఎటువంటి దుఃఖములను గోవులకు కలుగచేయరాదు.
* దక్షిణాయన ప్రవేశమునాడు , ఉత్తరాయణ ప్రవేశమునాడు , విషువద్దినమునాడు , పండ్రెండు సంక్రమణముల యందు , చంద్ర , సూర్యగ్రహణముల యందు గోవులకు ఉపచారములు చేయవలెను .
* అమావాస్య , పూర్ణిమల యందు , చతుర్దశినాడు , ద్వాదశినాడు , అష్టమినాడు , ప్రతినెలలోను గోవులకు ఉపచారం చేయవలెను .
* గ్రీష్మఋతువులో గోశాల వృక్షములతో గూడుకొని ఉండునట్లు , శీతాకాలంలో వెచ్చగా , పొడిగా , వర్షాకాలం నందు సుఖోష్ణముగా , గాలి తగలకుండా ఉండునట్లు ఏర్పాటు చేయవలెను .
* గోమయం , గోమూత్రం చూచి అసహ్యం చెందకుండా గోవులను కట్టు గోశాల బాగుగా పరిశీలించి తడిలేకుండా శుభ్రముగా ఎండించవలెను . సున్నము కొట్టవలెను.
* గోశాల యందు ఎంగిలి , మలమూత్రములు , శ్లేష్మము మున్నగు అశుద్ధ వస్తువులను ఉంచరాదు. రజస్వల కన్యను , కడుపుతో ఉన్నవారిని గోశాల లోపలికి రానివ్వరాదు.
* లేగదూడల మీదుగా దాటరాదు. గోశాల లొపలికి చెప్పులు వగైరా వేసుకొని లోపలికి ప్రవేశించరాదు.
* ఏనుగు మొదలగు వాహనములు ఎక్కి గోవుల మధ్య పోరాదు . కుడివైపునగాని , ఎడమవైపునగాని అతివినయముగా పోవలెను .
* ఏ గోపాలకుడు గోవును కట్టుచోట ధూపం వేయడో వాడు దోమలుండు నరకములో ప్రవేశించి దోమలచే భక్షింపబడును.
* గోవులను మేతకొరకు దూరంగా ఎప్పుడూ విడువరాదు. గోవులు దూరంగా సంచరించడం శుభప్రదమైన పనికాదు.
* గోశాలకు ప్రవేశద్వారం దక్షిణముగా ఉండవలెను . అదేవిధముగా ఏనుగుల యొక్క , గుఱ్ఱముల యొక్క శాల దక్షిణముఖద్వారం ఉండునట్లు ఏర్పరిచిన పశువులకు శుభం కలుగును.
* పచ్చటి గడ్డితో ఉండి గోవు తినడానికి అనుకూలముగా గడ్డి ఉన్న భూమిని దున్నినవానికి ఎన్ని జన్మలెత్తినను తృప్తి ఉండదు. నరకమును పొందుదురు. పెద్దపులి వంటి దుష్టజంతువుల వలన భయపడిన గోవును , బురదలో దిగబడిన గోవుని , నీటిలో మునిగిన గోవుని తప్పించి గోవుని ఆపద సమయంలో రక్షించువాడు స్వర్గమును పొందును.
* గోవులకు లవణము పెట్టువాడు సౌందర్యవంతునిగా జన్మించును. గొప్ప సౌభాగ్యం కలవాడగును. గోవులకు ఔషధము ఇచ్చువాడు రోగరహితునిగా ఉండును. ఔషధము , జలము , ఆహారం , లవణము గోవులకు మిగుల మంచిది .
* మందలో ఉండు గోవులలో దేనికైనను పెద్దతోడేలు మొదలగు దుష్ట జంతువులు బలవంతముగా చంపిన పాలకునకు దోషము లేదు . గోవులను చంపినవాడు ఇరువదియొక్క నరకములను పొందును.
* భారతము నందలి అనుశాసనిక పర్వము 132 వ అధ్యాయము నందు ఈ విధముగా ఉన్నది. గోవులు గొప్ప సామర్ధ్యము కలవి. మిక్కిలి పవిత్రవంతములైనవి . దేవాసుర మానవులతో కూడిన మూడులోకములను మోయుచున్నవి. అని వివరముగా ఉన్నది.
* దూడ చచ్చిన గోవును విరిచి కట్టి పాలుపితుక్కోని తాగినవాడు , అట్టి గోవులచేత బరువులను మోయించువాడు చిరకాలము క్షుద్బాధ చేత పీడింపబడును.
తరవాతి పోస్టులో పశుసంబంధమైన ధర్మసూత్రములు మీకు వివరిస్తాను.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల - 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
Comments
Post a Comment